||సుందరకాండ. ||

||తత్త్వదీపిక - పదవ సర ||

||మండోదరీ దర్శనము||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ దశమస్సర్గః

తత్త్వదీపిక
మండోదరీ దర్శనము

ఈ సర్గలో కథ ఈ విధముగా చెప్పవచ్చు:

సీతాన్వేషణలోనున్న హనుమంతుడు
ఆ శయనాగారములో స్ఫటిక రత్న విభూషితమైన,
"అశోకమాలావితతం దదర్శ పరమాసనమ్" ,
అశోక పుష్పమాలలతో అలంకరింపబడన ఒక శయనాసనమును చూచెను.

ఆ శయనాసనము మీద "ప్రసుప్తం రాక్షసాధిపం",
పడుకొని ఉన్న రాక్షసాధిపతిని అంటే రావణుని
"దదర్శ స మహాకపిః" , హనుమంతుడు చూశాడన్నమాట..

ఆ హనుమంతుడు పాము బుసలవలే వున్న ఉచ్చ్వాస నిశ్వాసములు చేయుచున్న రావణుని ,
"ఆసాద్య" సమీపించి, ఉద్విగ్నమనస్సు కలవాడై, "ఉపాసర్పత్ సుభీతవత్",
భయపడినట్లు ఒక అడుగు వెనక్కివేశాడుట.

ఇక్కడ కవి రెండు పదాలను ఉపయోగిస్తాడు.
'పరమోఽద్విగ్నః' , 'సుభీతవత్'.
ఉద్విగ్న మనస్సు ఎందుకు?
దీన్నిగురించి రామాయణ తిలకలో ఇలా రాస్తారు.
"అయం పాపీ దేవీం హృతవాన్
ఇత్యేతత్ సమీపే ఆస్థానమ్ అనుచితమితి ఖిన్నచిత్తో ఉపాసర్పత్"|
" ఈ పాపత్ముడు దేవిని ఎత్తుకుపోయాడు.
వీది సమీపములో ఉండడము కూడా అనుచితము అని
ఖిన్న మనస్సుతో వెనక్కి పోయాడు."

ఇక రెండవమాట 'సుభీతవత్ '!
దీనిమీద రామాయణ తిలకలో ఇలా రాస్తారు.
'సుభీతవత్ - సుభీతా యథా భయహేతోః
పిశాచాదేః సంముఖేస్థాతుం అశక్తః ఉపసర్పత్ తద్వత్|'
"సు భీతవత్ అంటే భయపడతగు పిశాచములు మున్నగు వారి సంముఖములోనిలబడలేక వెనకి పోయినట్లు అని"
ఇది క్షణిక మాత్రమే.

ఈ రెండు మాటలు పరస్పర విరుద్ధముగా వున్నాయా అనిపించవచ్చు.
ఇక్కడ రెండు సంఘటనలు జరిగాయి.
ఈ దుర్మార్గుడు సీతని తీసుకు పోయాడని ఉద్విగ్నుడయ్యాడు.
ఆ పాముల బుసవంటి ఉచ్చ్వాస నిఃశ్వాసములు క్షణికమాత్రము భయకారణమైంది.
ఆ భీతితో ఒక అడుగు వెనక్కి వేశాడు హనుమ.

అప్పుడు ఆ మహాకపి ఇంకొక మెట్లపైకి ఎక్కి,
ఆ నిద్రిస్తున్న రాక్షస శార్దూలమగు రావణుని దూరమునుంచి చూడసాగెనట.

ఆ చూపులో ముఖ్యముగా కనపడినవి "రాక్షసేన్ద్రస్య భుజౌ" ,
అవి ఎలాంటివి?
"వజ్రోల్లిఖిత పీనాంసౌ"- వజ్రాయుధపు గాట్లు కలిగినవి
"విష్ణు చక్ర పరిక్షతౌ"- విష్ణు చక్రము యొక్క గాయముల మచ్చలు కలిగినవి (9.16).
అవి "దేవ దానవ రావిణౌ "(9.20) దేవదానవులను విలపించిన భూజాలుట.
అవి రావణుని శౌర్యమును ప్రకటిస్తున్నాయి అన్నమాట.

ఆ వానరుడు ఆ రాక్షసాధిపతి గృహములో
ఆ మహాత్ముని పాదముల వద్దనున్నరావణుని ప్రియమైన భార్యలు చూసెను.
ఆ రావణుని భార్యలు ,
"శశి ప్రకాశ వదనాః" అంటే ప్రకాశించుచున్న చంద్రుని ముఖము కలవారు ,
"చారుకుణ్డలభూషితాః" అంటే అందమైన కుండలములు ధరించినవారు,
"ఆమ్లానమాల్యాభరణాః" అంటే వాడిపోని పుష్పమాలలు ధరించినవారు.
ఆ రావణుని భార్యలలో నృత్య వాద్యములలో ప్రవీణులు,
అందమైన ఆభరణములను ధరించి రావణుని భుజముపై శయినిస్తున్నవారిని చూచెను.

అప్పుడు ఆ వానరుడు వారిలో
ఏకాంతముగా శుభమైన శయనములో శయనించుచున్న ,
"దదర్శ రూపసంపన్నాం" - రూపసంపన్నముగల ఒక స్త్రీని చూచెను

ఆమె బంగారుమణులతో కూడిన ఆభరణములతో విభూషితమైనది.
తన కాంతులతో ఆ ఉత్తమమైన భవనమునకు అందము చేకూర్చుచున్నదా అన్నట్లు ఉన్నది.
బంగారు వర్ణము కల, "అంతః పురేశ్వరీం" - అంతఃపురమునకు రాణి అయిన,
అందమైన రూపము గల, గాఢ నిద్రలో ఉన్నఆమె
రావణుని ముఖ్యపట్టపురాణి మండోదరి.

అ మహాబాహువులు కల ఆ మారుతాత్మజుడు
ఆభరణములతో భూషితమైన, రూపసంపన్నము కల ఆమెను చూచి,
"తర్కయామాస సీతేతి" - ఈమె సీతయా అని తర్కించి,
సీత అని భావించి మహత్తరమైన ఆనందముతో ఉప్పొంగి పోయెను.

ఆ సంతోషముతో జబ్బలు చరుచుకుంటూ
తోకను ముద్దెట్టుకుంటూ
ఆట పాటలతో స్తంభములను ఎక్కుతూ
క్రిందకు దూకుతూ
వానరులకు స్వాభావికమైన ప్రకృతిని హనుమంతుడు ప్రదర్శించెను.

ఇది మనము వాల్మీకి రామాయణములోని సుందరకాండలో పదవ సర్గ లో వినే కథ.

ముందు సర్గలలో విన్న " స్వర్గోయమ్ దేవలోకోయమ్.."
అన్న మాటలకు అనుగుణముగా
ఈ సర్గలో రావణుని రాజభవనములో రావణుని వర్ణనలో,
రావణ స్త్రీల వర్ణనలో
ప్రతి శ్లోకములో
ఇది భోగలోకము అనే మాటని పదే పదే స్థిర పరుస్తాయి.

ఇంకా తొమ్మిదవసర్గలో " అససాదాధ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివవేశనమ్" అని చెప్పినప్పుడు ,
హనుమంతుడు పంచకోశములలో మనోమయ కోశము లో ప్రవేశించాడని విన్నాము.

ఈ సర్గలో ఆ మనోమయకోశములో నిద్రపోతున్న రావణుని గురించి వింటాము.

మనస్సు నందలి వాసనలు లేదా చిత్త వృత్తులు మూడు దశలు కలిగి వుంటాయి.

(1) సుప్త దశ
(2) క్షీణ దశ
(3) ఉద్బుద్ధ దశ అని.

ఒకప్పుడు అవి నిద్రించు చుండును.
ఆ నిద్రలో వాని శక్తి బయటకు ప్రసరింపదు
నిద్రించువాడు ఎంత క్రూరుడైననూ నిద్రలో క్రూరములగు వ్యాపారములను చేయడు

ఒకప్పుడు అసుర రాక్షసములైన చిత్తవృత్తులు,
ఆ సమయములో, అంటే నిద్రలో అణగియుండును.
అవి ఒకప్పుడు బాగుగా తగ్గి కృశించినట్లుగా కూడా వుండును.
ఆ రాక్షస వృత్తులు కోపము బాగుగా తగ్గినప్పుడు కూడా లేవన్నట్లు ఉండును.
కాని చిన్న కణమువలె నున్న నిప్పుపై కొద్దిగా ఊక వేసి రాజబెట్టినచో మరల ఏట్లు అది ప్రజ్వరిల్లునో,
అదే విధముగా కృశించిన కామక్రోధాదులు కూడా అనుభవింపదగిన విషయములు లభించినచో మరల విజృంభించును.

కావున మనో వృత్తులు నిద్రాణములై ఉన్నదశలో అన్వేషణ సాగింపవలెను.
రాజస తామసములగు భావనలు ప్రకృతివశమున తగ్గియున్నప్పుడే
అన్వేషణ సాగించవలెనని దీని చే సూచింపబడినది.

అట్టి దశలో కూడా దానిని జయింపశక్తి కలవానికి కూడా మనసు భయమునే కలిగించును.
అందుకనే శత్రుకర్షణుడైన హనుమంతుడు,
వేయిమంది రావణులను చంపగల హనుమంతుడు,
నిద్రలో వున్న రావణుని చూచి భయపడి ఒక అడుగు వెనకవేశెను అని వర్ణిస్తాడు వాల్మీకి.

అలాగే ఆత్మ అన్వేషణలో కూడా రాజస తామస ప్రకృతులు అణగబడియున్నప్పుడే
ఆ అత్మాన్వేషణ ముందుకు సాగుతుంది.

ప్రతి శ్లోకములో అన్వేషణ లో బాహ్యసౌందర్యము విషయభోగము ఎంత ఆకర్షించునో,
దానిని తట్టుకొని అత్మాన్వేషణ సాగుట ఎంతకష్టమో ,
ఇంద్రియార్థములు ఇంద్రియములను ఎంత బలాత్కరించునో
ఈ సర్గలలో మనకు కనపడును.

హనుమంతుని అన్వేషణలో
లోకోత్తరమగు సౌందర్య ము కల భవనములు, శిల్పములు, స్త్రీలు, మధురములగు భక్ష్యములు, పానములు కనపడును.
అది అంతా చూసి, "స్వర్గోయం దేవలోకోయమ్.." అనుకుంటాడు హనుమ.
వానిని అన్నింటినీ చూచుచూ వాటివేపు మనసు పోకుండా సీతాన్వేషణ సాగుచుండును.
దీనిని మనకి తెలియచేయుటకా అన్నట్లు
బాహ్యసౌందర్యము ఇక్కడ చాలా అధికముగా వాల్మీకి వర్ణించెను.

బాలకాండలో అయోధ్యాపుర వర్ణన వుంది.
సుందరకాండలో లంకానగర వర్ణన వుంది.
అయోధ్యాపుర వర్ణనకు లంకాపుర వర్ణనకు భేదము కనిపిస్తుంది.

అయోధ్యాపురవర్ణనలో పట్టణవర్ణ కన్న ప్రజల వర్ణన అధికముగా కనిపించును.
' నాకుండలీ నామకుటీ నాస్రగ్వీ నాల్పభోగవాన్' అంటూ వారి సంపదను,
"ననాస్తికః నచానృతకథః నావిద్వాన్ నా బహుశ్రుతః" అంటూ వారి గుణసంపదను వర్ణించును.

లంకావర్ణనలో భవన యౌవ్వన వర్ణన.
ఇది బాహ్యాభ్యుదయము.
దీని యందు ఆసక్తి కలిగియుండుటయే ఆత్మబంధ హేతువు.
దీని యందు దృష్టి మరలక ఆత్మయందే ఏకాగ్రచిత్తము కలవాడు మాత్రమే అత్మ దర్శనము చేయగలడు.

ఈ రహస్యమును మనకి హనుమంతుని సీతాన్వేషణ మనకు సూచిస్తుంది.

ఇంక ముందుకు పోయి పానుపై పైకి చేతులు చాచుకు పడుకొని ఉన్న రావణుని
భుజములను వాల్మీకి ఎంతో వర్ణించును.
అవి ఎలాంటివి?
"వజ్రోల్లిఖిత పీనాంసౌ"- వజ్రాయుధపు గాట్లు కలిగినవి
"విష్ణు చక్ర పరిక్షతౌ"- విష్ణు చక్రము యొక్క గాయముల మచ్చలు కలిగినవి (9.16).
అవి "దేవ దానవ రావిణౌ "(9.20) దేవదానవులను విలపించిన భూజాలుట.
అవి రావణుని శౌర్యమును ప్రకటిస్తున్నాయి అన్నమాట.
ఇంకా పైగా,
ఆ బాహువులు మందరపర్వతములో పగపట్టి పరున్న పాములవలె ఉన్నవట.
సర్వకర్మలకు మూలము బాహువులు. కర్మలే మనను బంధించునవి.
అట్లు బంధ హేతువులగు బాహువులను చూచి హనుమ అశ్చర్యముతో మనకు వర్ణిస్తాడు.
కామపూరితమైన మనసుయొక్క ప్రేరణ చేసెడి కర్మలను
బంధహేతువులుగా గుర్తింపపవలె నని రావణ బాహువుల వర్ణన చేయబడినది.

"బాహువుల గురించి ముందు నాలుగొవ సర్గలో ఒక సారి విన్నాము.
"అద్వారేణ మహాబాహుః ప్రాకారమభిపుప్లువే"
అవి హనుమంతుని బాహువులు.
"రామార్థం వానరార్థం చ" అని రాముని కొఱకు వానరుల కొఱకు నిష్కామ కర్మ చేస్తున్న హనుమంతునివి.
అ బాహువులు చేసే ఆ నిష్కామ కర్మలతో బంధములు కలగవు.
అవి మహాబాహువులు.
ఇక్కడ రావణ బాహువుల వర్ణనలో మనకి తెలిసేది
ఈ రావణ బాహువులు భోగలోకములో అనుభవిసున్న బాహువులు అని.

ఇంకోక విషయము.

ఈ భుజముల వర్ణలలో "భుజౌ" అంటూ రెండు భుజములని మనకి సూచిస్తాడు.
అలాగే మకుటము గురించి చెపుతూ ఒకటే శిరస్సు లాగా వర్ణన చేయబడినది.
పది తలలు ఇరవైచేతులు గల రావణుని ఇలా ఎలా వర్ణింపబడడమైనది అని మనకు ఆశ్చర్యము రావచ్చు.

రావణుడు కామరూపి.
కామరూపి కనక యుద్ధములోనూ వెలుపల తిరుగునప్పుడు పది తలల తోనూ,
ప్రియురాండ్రతో కలిసి రమించునపుడు ఒక శిరస్సుతోనూ ఉంటాడని మనము భావించ వచ్చు.

కాని దీనికి వేరొక అర్ధము ఉంది.
రావణుడు మనస్సు.
అది రావణుడు అనే మాటలో అర్థము
పది ఇంద్రియములు పది ముఖములు.
నిద్రించునపుడు ఇంద్రియవ్యాపారములు విరమించును.
మనసు మాత్రమే పనిచేయుచుండును.
అందుచే పది తలలు ఉండవు.
ఇరువది చేతులూ ఉండవు.
మరల లేచినపుడి ఇంద్రియములు తమ తమ వ్యాపారములను ఆరంభించును.
అందుచే పది తలలు లేచును.
మను పండుకున్నప్పుడు కన్ను చూడదు. చెవి వినదు.
కాని లేచుసరికి మాటలు వినిపించును. వాసనలు వచ్చుచుండును. అందుచే ఇంద్రియములు లేచును.
ఇట్లు ఇంద్రియవ్యాపారములు తగ్గినప్పుడు హనుమ సీతాన్వేషణ చేయుచున్నాడు.

ఆ సీతాన్వేషణలో అంతఃపురస్త్రీలలో ప్రధానురాలగు మండోదరిని చూచెను.
రూపము యౌవ్వనము లలో ఆమె సీతలాగే ఉండెను.
మండోదరికూడా సీతమ్మవలెనే అందకత్తె. యౌవ్వనవతి.
హనుమ సీతమ్మ అనుకొనుటకు ఆ రూపము యౌవ్వనమే కారణము.
గుణములబట్టి చూచినచో ఆమె సీతమ్మకు సమానురాలు కాదు.
తాత్కాలికముగా హనుమంతునికి ఈ ఆలోచన తట్టలేదు.
అవిడ సీతయే అనుకొని మహదానందము పడతాడు.

నిండుదనము లేని పసివారికి ఏదైన హర్షకాలము కలిగినచో ఎలాగ ఏట్లెగిరి గంతులు వేయుదురో,
అట్లే హనుమంతుడు కూడా ఎగిరి గంతులు వేసెను.
ఆ గంతులే ఇది పూర్ణమైన స్థితి కాదని కపిచేష్టితమని సూచించుచూ,
"నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం" (10.54) అంటాడు కవి.
అంటే కపి ప్రవృత్తిని ప్రదర్శించెను అని అంటాడు.
పిల్లలకు ఏదైనా ఉత్సాహము కలిగినచో గంతులు వేయుదురు.
వారి ఆనందము క్రియల చేతనే ఎక్కువగా ఆవిష్కృతము అగును.
అదేవిషయము సూచించుటకు కవి ఇక్కడ చాలా క్రియా పదములను ఉపయోగించెను.

చూడబడినది నిజమైన సీతకాదని
అతని చేష్టల చేతనే మనకి స్ఫురింప చేయుచూ
చివరికి ఇది కపి ప్రవృతి అని పేర్కొనెను.

కేవలము శాస్త్రములలో చదివి ఊహించి
(1) దర్శించినట్లు అనుభవించుట
(2) ప్రత్యక్షముగా దర్శించుట
అను ఈ రెండిటికీ భేదమును మండోదరీ దర్శనమున సీతాదర్శనమున మనకు కనపడును.

ఆ రెండింటికి వున్న భేదమే అనుభవమునకు అనుభూతికి ఉన్న తేడా.
సీతవలెనున్న మండోదరి చూచినప్పుడు హర్షముతో గంతులు, పాటలు వచ్చెను.
హర్షము అనుభవించెను.
నిజముగా సీతను చూచినపుడు "భాష్పపర్యాకులేక్షణః"( 16.2),
అంటే కన్నీటితో నిండిన కనులు గలవాడై విచారించుచూ మాట్లాడక యుండిపోయెను.

తుమ్మెద పూవు చుట్టు తిరుగునంతసేపు ధ్వని చేయును.
పూవుపై వ్రాలి మకరందమును ఆస్వాదించునపుడు మౌనమే తప్ప ధ్వని చేయదు.
అట్లే ఆత్మానుభవము గాని భగవదనుభము కాని పొందువారు
కంఠము గద్గదమై ఒడలు గగుర్పొరచి తన్మయములో ఉందురు కాని బాహ్యముగా చేష్టలతో ఆనందమును ఆవిష్కరింపరు.

ఇలా కుప్పిగంతులతో కూడిన హర్షము మనకు తెలియపరచేది,
ఇచటి దర్శనము సీతాదర్శనము కాదు అని.

||ఓమ్ తత్ సత్||
|| శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వ గీతలో ఇది మాకు అర్థము అయిన మాట||
|| ఓమ్ తత్ సత్||